భగవద్గీత - శ్లోకం 2: దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యమువనంగమ్య రాజా వచనమబ్రవీత్ ||


Bhagavad Geetha - Telugu - Sloka - 0002

సంజయ ఉవాచ (సంజయుడు పలికెను)

దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యమువనంగమ్య రాజా వచనమబ్రవీత్ ||

ప్రతిపదార్థం:

సంజయః ఉవాచ = సంజయుడు పలికెను; దృష్ట్వా = గాంచిన పిమ్మట; తు = కాని; పాఱ్ఱవానీకం = పాండవుల సేనను; వ్యూఢం = వ్యూహముగా ఏర్పరుపబడిన దానిని; దుర్యోధన: = దుర్యోధనుడు; తదా = అప్పుడు; ఆచార్యం = గురువును; ఉపనంగమ్మ = సమీపించి; రాజా = ఓ రాజా; వచనం = వాక్కులను; అబ్రవీత్ = పలికెను;

తాత్పర్యం:

సంజయుడు పలికెను: ఓ రాజా! పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను.

భాష్యము:

ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మికదృష్టి సైతము లోపించెను. ధర్మవిషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండియు ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై యుండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసికొనగలిగెను.

కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనెంచి, పవిత్రస్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరుగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతియైన ద్రోణాచార్యుని చెంతకు చేరెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రత ననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసివచ్చెను. కనుకనే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను.