భగవద్గీత - శ్లోకం 1: ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||


Bhagavad Geetha - Telugu - Sloka - 0001

ధృతరాష్ట్ర ఉవాచ (ధృతరాష్ట్రుడు పలికెను)

ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

ప్రతిపదార్థం:

ధృతరాష్ట్ర ఉవాచ = ధృతరాష్ట్రుడు పలికెను; ధర్మ క్షేత్రే = యాత్రాస్థలమునందు; కురుక్షేత్రే = కురుక్షేత్రమను పేరుగల ప్రదేశమున; సమవేతా = సమకూడి; యుయుత్సవః = యుద్ధము చేయగోరువారై; మామకాః = నా పక్షమువారు (పుత్రులు); పాణ్డవా: = పాండురాజు కుమారులు; చ = మరియుఁ; ఏవ = నిశ్చయముగా; కిం = ఏమి; అకుర్వత = చేసిరి; సంజయ = ఓ సంజయా!;

తాత్పర్యం:

ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయా! ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?

భాష్యము:

శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞానశాస్త్రము. అది గీతామాహాత్మ్యము నందు సంగ్రహింపబడినది. భగవద్గీతను కృష్ణభక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసికొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది. గీతము అర్జునుడు శ్రీకృష్ణభగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసికొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్యపరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసికొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను సైతము పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అదియే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రమై విరాజిల్లుచున్నది.

మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్త్వశాస్త్రమునకు మూలసిద్ధాంతములై యున్నవి. అనాదియైన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధినొందిన కురుక్షేత్రమునందు ఈ తత్త్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణభగవానుడు స్వయముగా ప్రత్యక్షమైయున్నపుడు మానవాళి నిర్దేశనార్ధము దీనిని పలికియుండెను.

కురుక్షేత్రరణరంగమున శ్రీకృష్ణభగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మ క్షేత్రమను (ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము) పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రియైన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్థుడై యుండెను, కనుకనే తన సందేశమున అతడు "వారు ఏమి చేసిరి" అని కార్యదర్శియైన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంఛింపలేదు. అదియును గాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను.

కాని దేవతలకు సైతము పూజనీయస్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధపరిణామముపై స్థలప్రభావమును గూర్చి అతడు మిగుల భీతినొందెను. స్వభావరీత్యా ధర్మాత్ము లైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడెరిగి యుండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను.

పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండుసంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల యెడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరైనను అవగతము చేసికొనవచ్చును. పంటపొలము నుండి కలుపుమొక్కలు తీసివేయబడు రీతి, ధర్మపితయైన శ్రీకృష్ణభగవానుడు నిలిచియున్న ధర్మ క్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపుమొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు, యుధిష్ఠిరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్ఠితులు కాగలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహింపబడినది. చారిత్రిక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక “ధర్మ క్షేత్రము" మరియు "కురుక్షేత్రము" అనెడి పదములకు గల విశేషార్థమిదియే.